30 ఆగస్టు, 2012

భలే శుంఠ

విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానంలో తెనాలి రామలింగడు కవి. ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి, తన పాండిత్యంతో రాజును మెప్పించేవాడు.రాయలవారి ఆస్థానంలో ప్రతి ఏటా "భలే శుంఠ" అనే పోటీలు జరుగుతుండేవి. ఈ పోటీలలో అందరికంటే గొప్ప శుంఠను గుర్తించి 5 వేల బంగారు నాణాలతో రాజు సత్కరించేవారు. అయితే, ప్రతిసారీ ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలివితేటలతో గెలుచుకుంటుండేవాడు.


దీన్ని గమనించిన ఆ రాజ్యంలోని సేనాధిపతికి కోపంతో "ఎప్పుడూ రామలింగడే గెలుచుకుంటున్నాడు. ఈసారి వేరొకరికి ఈ బహుమతి వచ్చేలా చేయాలి" అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సరిగ్గా పోటీలు మొదలయిన రోజు రామలింగడి గదికి బయటినుండి గడియ పెట్టించాడు.ఒకవైపు రామలింగడు ఆ గదిలోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంటే... మరోవైపు రాయలవారు పోటీలను తిలకిస్తూ, శుంఠ ఎవరో తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు. చివరకు ఎలాగోలా రామలింగడు గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటుకు చేరుకున్నాడు.

దీన్ని గమనించిన రాయలవారు "అదేంటి రామలింగా...! ఎందుకింత ఆలస్యంగా వచ్చావు...?" అంటూ ప్రశ్నించారు. సమాధానంగా రామలింగడు మాట్లాడుతూ... "ప్రభూ...! నాకు ఉన్నట్లుండి వంద బంగారు నాణేల అవసరం వచ్చింది. వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది" అని అన్నాడు."ఏంటీ... వంద బంగారు నాణేల కోసం ఇంత సమయం వృధా చేశావా...? ఈ పోటీకి వచ్చి, గెలిస్తే నీకు 5వేల బంగారు నాణేలు దక్కేవి కదా...! ఆ మాత్రం నీ బుర్రకు తట్టలేదా...? ఒట్టి శుంఠ లాగున్నావే...!" అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు. "అవును ప్రభూ...! నేను శుంఠనే..!" అని అన్నాడు రామలింగడు రెట్టిస్తూ... "నిజంగా నువ్వు శుంఠవే...!" కోపంగా అన్నాడు శ్రీకృష్ణదేవరాయులు. 

 అప్పుడు రామలింగడు తెలివిగా... "ప్రభూ...! నిజంగా శుంఠను నేనే కదా...! అయితే ఈ పోటీ నేనే నెగ్గినట్లు కదా...!" అన్నాడు. దాంతో నాలిక్కరుచుకున్న రాయలవారు రామలింగడి తెలివికి మెచ్చి, 5వేల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చి, విజేతగా ప్రకటించాడు

  

19 ఆగస్టు, 2012

రాజగురువు తెలివి

ఒకప్పుడు విజయభట్ అనే రాజగురువు వుండేవాడు. ఆ ఆస్థానంలో పన్నెండు అగ్రహారాలు వుండేవి. అందులో సురేంధ్రనగర్ అగ్రహారంలో భట్ నివసించేవాడు. ఆస్థానమంతా అర్జున్ సింగ్, సాబర్ సింగ్, అనబడే అన్నదమ్ముల ఆధీనంలో వుండేది. ఇందులో అర్జున్ సింగ్ యోగ్యుడు, బుద్దిమంతుడు, ఈ విషయం రాజగురువు భట్‌కు బాగా తెలుసు. కొన్నాళ్ళకు ఆ అన్నదమ్ములు విడిపోవాలని నిశ్చయించుకొన్నారు. అయితే సురేంధ్రనగర్ అగ్రహారం కోసం ఇద్దరూ వాదులాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం రాజగురువుదాకా వెళ్ళింది. ఆయన ఆ అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. వారు గురువును చూచి ఎంతో గౌరవంగా పిలిచారు. తమ సమస్యను తీర్చ వలసిందిగా కోరారు. అప్పుడు రాజగురువు వారికొక కధ చెప్పాడు.

పూర్వము ఒకప్పుడు ఒక మహర్షి వుండేవాడు. ఆయనవద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. విధ్యాభాసం పూర్తయ్యాక వారు గురువును సెలవు కోరారు. అప్పుడు గురువు ఇద్దరికీ పిడికెడు విభూతి ఇచ్చి వెళ్ళి సుఖంగా వుండమని దీవించాడు. అందులో ఒకడు విభూతిని ఎంతో భక్తితో స్వీకరించి తినివేశాడు. మరొకడు చిన్నచూపుతో దాన్ని పారవేశాడు. విభూతిని స్వీకరించినవాడికి సకల విధ్యలు అబ్బినాయి. అన్ని వేళలలో నిష్ణాతుడయ్యాడు. రెండవ వాడు మాత్రం మందబుద్దితో తిరిగి వచ్చి గురువును తూలనాడాడు. రాజగురువు పై కధ చెప్పి నా తీర్పువిన్నాక రెండవ శిష్యునివలే తనను నిదించకూడదని అన్నాడు. అందుకు వారు అంగీకరించారు. సమస్యను రేపు పరిష్కరిస్తానని రాజగురువు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కధలో మొదటి శిష్యుడు చేసినట్లు చేయవలసిందిగా అర్జున్ కు రాజగురువు రహస్యంగా వర్తమానం పంపాడు. సురేంధ్రనగర్ అర్జున్ సింగ్ ఆధీనంలోకి రావాలన్నదే రాజగురువు ఆశ కూడ.

మరుసటి నాడు రాజ గురువు రెండు చీటీలను ఉండలుగా చుట్టి అర్జున్ సింగ్ ను సాబల్ సింగ్ ను ఇష్టానుసారం తీసుకోమని చెప్పాడు. అర్జున్ సింగ్ చీటీ తీసుకొని మ్రింగివేసాడు, సాబల్ సింగ్ చీటీ చూచుకొన్నాడు. అందులో "సురేంద్ర నగర్ మీదికాదు" అని రాసి వుంది. మాట ప్రకారం సాబల్ సింగ్ సురేంద్ర నగరను అర్జున్ సింగ్ కు వదిలి పెట్టాడు. అయితే రాజగురువు రెండు చీటీలనూ ఒకే విధంగా అంటే "సురేంద్ర నగర్ మీదికాదు" అని రాసినట్లు తెలియదు. ఎంతో తెలివిగా ఆయన సురేంద్రనగర్ ను బుధ్ధిమంతుడైన అర్జున్ సింగ్ కు వచ్చేలా చూశాడు. మంత్రి సుబుధ్ధితో ఈ విషయం వివరించాడు.




18 ఆగస్టు, 2012

కప్ప చెడు స్నేహం


ఒక కప్పా, పాము మంచి స్నేహితులుగా వుండేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు భుసకొట్టడం నేర్పించింది.పాము నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దెగ్గిరకు వెళ్ళేవి. పాము చటుక్కున వాటిని తినేసేది.

కప్ప నీళ్ళల్లో భుస కొడుతుంటే దాని దెగ్గిరకు పాములు వచ్చేవి కాదు. కప్ప నిర్భయంగా వుండేది. ఇలా కొంత కాలం కొనసాగింది.కాల క్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దెగ్గిరకు వెళ్ళడం మానేసాయి. పాము తినడానికి యేమి లేక చిక్కి క్షీణించుకు పోయింది. ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది.

చెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైన మనకే చేటు.

17 ఆగస్టు, 2012

నక్క రంగులు


పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి దెగ్గిరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టే సరికే భరించలేక కేకలు పెట్టి, “చారలు కావాలికాని నొప్పి కాదు, ఇంకేదైన చేయి” అంది నక్క. “ఐతే రంగులు పులివించుకో” అన్నాడు కంసాలాడు.


రంగులు వేసే వాడి దెగ్గిరకు వెళ్ళి రంగులు పులవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడివిలోకి వెళ్ళి, పులి లాగ గాండ్రించబొయి, ఒక ఊళ్ళ పెట్టింది. ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూసాయి. ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్ని నీళ్ళల్లో కలిసి చెరిగి పోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడ నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి.


ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది.


అద్దం ముక్క మెరుపు


ఒక రోజు ఒక అద్దం ముక్క ఒక రాయి తో ఇలా అంది: “నన్ను చూడు, నేను ఎంత మెరుస్తున్నానో? ఆ సూర్యుడే నన్ను మెచ్చుకుని నాకీ మెరుపునిచ్చాడు”.  ఆ రాయి, “అలాగా, నా అభినందనలు” అని సమాధానమిచ్చింది.

కొన్ని రోజుల తరువాత ఒక పిడుగు అద్దం మీద పడింది. అద్దం పిడుగు మంటకు కాలిపోయి, దాని మొత్తం మెరుపును కోల్పోయింది.ఆ రాయి, “నీ మెరుపు ఏమైంది?” అని అద్దాన్ని అడిగింది.

“ఒహ్, ఆ పిడుగు వచ్చి నా దెగ్గిర అరువు తీసుకుంది” అన్నదా అద్దం. “ఒక్క సారి మన గొప్ప చాటుకున్నాక ఎన్ని అబద్ధాలాడాలో” అనుకుంది రాయి.

16 ఆగస్టు, 2012

గుడ్లగూబ విచక్షణ


ఒక అడివిలో ఒక కోతికి ఓ అద్దం దొరికింది. అది ఆ అద్దాన్ని అడవిలో జంతువులన్నిటికీ చూపించింది. భల్లూకం అందులో తన ప్రతిబింబం చూసుకుని, “అయ్యో, నేను ఇంత కురూపినా” అనుకున్నాడు. తోడేలు చూసి నేను కూడ జింకలాగా వుంటే బాగుండేది, అనుకుంది.

ఇలా ఒకటి తరవాతోకటి అన్ని జంతువులు వాటి ప్రతిమలను చూసుకుని ఇలా వుంటే బాగుండేది, అలా వుంటే బాగుండేది అనుకున్నాయి.చివరికి కోతి ఆ అద్దం ఒక వివేకవంతమైన గుడ్లగూబ దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ గుడ్లగూబ, “వద్దు నాకు చూపించద్దు. ఆ అద్దం చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి పడడం తప్ప దాని వల్ల వాళ్ళకు వచ్చిన ఙానము లేదు, విచక్షణ లేదు. అలాంటి దాన్ని చూసి బాధ పడడం అనవసరం” అని అంది. కోతి ఒప్పుకుని ఆ అద్దాన్ని నదిలోకి విసిరేసింది.

పగుళ్ళ కుండ భాధ

ఒక ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారు పోతుంటే, మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది.చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు" అంది.

"ఎందుకు? నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?" అడిగాడు పనివాడు. "ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు" అని నసిగిందా పగుళ్ళ కుండ. దాని బాధ అర్ధం చేసుకున్న పనివాడు "బాధపడకు, ఈ రోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది.

పనివాడు ఆ కుండతో "కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్‌ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు" అన్నాడు. పగుళ్ళ కుండ తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది.


9 ఆగస్టు, 2012

రంగయ్య ఉపాయం

ఒక గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని పొరుగింట్లో ఉండే సాంబయ్య కోళ్ళ వ్యాపారం చేసేవాడు. సాంబయ్య కోళ్ళు ప్రతిరోజూ రంగయ్య పెరడులోకి వచ్చేవి. రంగయ్య భార్య గింజలు ఎండకు ఆరబోస్తే, కావల సినంత తిని, కాళ్ళతో తొక్కి చెల్లాచెదురు చేసేవి. రంగయ్య రోజూ సాంబయ్యతో కోళ్ళను తన పెరడులోకి తోలవద్దని చెప్పేవాడు.‘‘అవి మనలాగ మనుషులా ఏమిటి? చెప్పిన మాట వినడానికి. మూగప్రాణులయ్యా! ఎటుపడితే అటు వెళ్తుంటాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ సాంబయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు. 

కొన్నిరోజులు ఇలాగే గడిచాయి. ఒకరోజు సాంబయ్య పొరుగూరు సంతకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఇంట్లోకి వెళుతూ తన కోళ్ళ కోసం రంగయ్య ఇంటి పెరడులోకి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.రంగయ్య నేల మీద అక్కడక్కడ పడున్న గుడ్లను ఒక బుట్టలోకి ఏరుకుంటున్నాడు. ‘‘రంగయ్యా! నీ దగ్గర కోళ్ళు లేవుగా! మరి ఈ గుడ్లు ఎక్కడివి?’’ అని అడిగాడు సాంబయ్య.‘‘ఇందాక నీ కోళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాయి. బహుశ అవే పెట్టి ఉంటాయి’’ అంటూ అమాయకంగా జవాబు చెప్పి లోపలికి వెళ్ళి పోయాడు రంగయ్య. సాంబయ్య నోరు వెళ్ళబెట్టాడు. ఇక ఆరోజు నుండి అతను తన కోళ్ళు రంగయ్య పెరడులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాడు. నిజానికి ఆ గుడ్లు సాంబయ్య కోళ్లు పెట్టినవి కావు. రంగయ్యే కోళ్ళ బెడద తప్పించుకోవడానికి అలా ఉపాయం పన్నాడు. 


కోడిపుంజును చూసి భయపడిన సింహం

ఒక అడవిలో ఒక కోడిపుంజు, గాడిద స్నేహంగా ఉండేవి. తీరికవేళల్లో అవి ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి. ఆరోజు కూడా ఎప్పటిలాగే మిట్టమధ్యాహ్నం వేళ చెట్టు దగ్గరకు చేరి ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటున్నాయి. ఇంతలో ఒక సింహం అటువైపు వచ్చింది. గాడిద వెనుక వైపు నుండి రావడం వల్ల అది సింహాన్ని చూడలేదు. కోడి చూసింది. వెంటనే అది భయపడి వింతగా అరుస్తూ చెట్టు కొమ్మ పైకి ఎగిరింది.


విచిత్రంగా వినపడ్డ కోడి అరుపు వినగానే సింహం ఉలిక్కిపడింది. సింహం కోడిపుంజును చూడలేదు. ‘‘అమ్మో! మిట్టమధ్యాహ్నం చెట్ల కింద పిశాచాలు జుట్టు విరబోసుకుని కూర్చుంటాయట. ఆ చెట్టు కింద ఏదో ఉంది బాబోయ్’’ అనుకుంటూ సింహం వెనక్కి పరుగెత్తసాగింది.సింహం పరుగెత్తిన శబ్దం విని గాడిద తిరిగి చూసింది.పరుగెడుతున్న సింహం కనిపించింది. అది తనని చూసే భయపడి పారిపోతోందనుకుంది. అంతే... మరుక్షణం గాడిద గట్టిగా అరుస్తూ ‘‘ఒరేయ్ ఆగరా! ఎక్కడికి పారిపోతున్నావు? నా చేతికి దొరికావంటే నీకు ఇదే ఆఖరి రోజవుతుంది’’ అంటూ వెంటబడింది. ఇదంతా చెట్టు పైనుండి కోడి చూస్తోంది. తన అరుపులకు సింహం భయపడిందని గ్రహించి ‘‘మిత్రమా, వెళ్ళకు! వెనక్కి రా!’’ అంటూ కేకలు పెట్టింది. గాడిద కోడిపుంజు మాటలు పట్టించుకోలేదు. అలాగే కాస్తదూరం సింహాన్ని అనుసరిస్తూ వెళ్ళింది.

కొద్దిదూరం వెళ్ళాక సింహం పరుగెత్తటం ఆపి వెనుకకు తిరిగి తన వెంటే వస్తున్న గాడిదను చూసింది. గాడిద తన దగ్గరకు రాగానే సింహం దాని మూతి మీద పంజాతో ఒక్కటిచ్చింది. దానితో గాడిద కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుండి పారిపోయి వచ్చేసింది.