20 అక్టోబర్, 2013

అందమైన రాకుమారి

ఒక రాణి దేశంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు ఆరడుగుల ఎత్తులో ఎంతో అందంగా, సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి చెయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా, సుకుమారంగా ఉండాలని కోరుకుంది. 

యువరాజుకి ఎన్నో రాజ కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. కాని ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. రాణి ఎన్నో సంబంధాలను కాదన్నదనే వార్త దేశమంతటా పొక్కింది. అది విన్న ఒక అందమైన రాకుమారి... రాణి గారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుకోవాలని అనిపించింది. అందుకని రాణి గారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలవాలనుకుంది. 

సైనికులు ద్వారా తన రాకను రాణి గారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవనంలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచిది. రాకుమారి రాణి గారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకు వెళ్ళారు. రాకుమారి ఎంత సున్నితమైనదో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని మల్లెపూలు పెట్టి, వాటి మీద ఏడు పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ మల్లెపూల వల్ల అస్సలు నిద్ర పట్టలేదు. 

ఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డయి. ఒళ్ళంతా కంది పోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైనదని, తనకు కోడలిగా, తన కొడుకుకు సరైన భార్యగా రాణిస్తుందని నిర్ణయించుకుంది.

19 అక్టోబర్, 2013

వ్యాపారి ధైర్యo

పూర్వం ఓ వ్యాపారి తన వస్తు సామాగ్రిని మరో దేశంలో అమ్మడానికి అనుచరులతో బయలుదేరాడు. దారిలో వారు ఒక ఎడారి చేరుకున్నారు. ఎండవేడిమికి ఇసుక కాలుతోంది. అలాంటప్పుడు అందులో ప్రయాణించడం దుర్లభం. అందరూ దిగాలు పడ్డారు. అరికాళ్లు బొబ్బలెక్కేటంత ఎండ మండిపోతోంది. ఎడ్లయినా, ఒంటెలైనా నడవడం చాలా కష్టం. అందునా వాళ్ల దగ్గర తగినన్ని మంచినీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలా ప్రయాణం కొనసాగించాలా అని విచారించసాగారు. 

వ్యాపారి "నేనూ అధైర్యపడితే వీళ్లు మరీ నీరుగారిపోతారు. ఈ పరిస్ధితుల్లో ఇలా వదిలేయడం నాయకత్వమనిపించుకోదు. ఏదో ఒకటి చేయాలి. లేకుంటే సరుకులు, ఇంత శ్రమా వృధా అయిపోతుంది. వీళ్లని రక్షించే మార్గమేదైనా ఆలోచించాలి" అనుకున్నాడు.  కనుచూపుమేరలో గడ్డి పరకలు కనిపించాయి. "నీరు లేకుండా ఏ మొక్కా ఎడారిలోనైనా పెరగదుగదా" అనుకున్నాడు. వెంటనే తన అనుచరుల్లో చలాకీగా వున్న వారిని పిలిచి అక్కడ గొయ్యి తవ్వమన్నాడు. తవ్వగా తవ్వగా వాళ్లకి రాయి అడ్డు వచ్చింది. విసిగెత్తి నాయికుడిని తిట్టుకున్నారు. "ఇదంతా వృధాశ్రమ, సమయాన్ని వృధా చేస్తున్నాం!!" అన్నారు. కానీ వ్యాపారి మాత్రం "స్నేహితులారా, అలా నిరుత్సాహపడద్దు ప్రయత్నించండి. కాదంటే మనం, మన ఎడ్లు ఆకలిదప్పులతో నాశనమవుతాం... ఉత్సాహం కోల్పోవద్దు" అన్నాడు. 

అతను అలా అన్నాడో లేదో, రాయి పగిలి గుంట ఏర్పడింది. దానిపై వొంగి అతను చెవి పెట్టి దాని అడుగున నీటి రొద విన్నాడు. వెంటనే తవ్వుతున్న కుర్రాణ్ణి పిలిచి, "ఆగిపోకు, అందరూ ఇబ్బంది పడతాం... ఇదుగో ఈ గొడ్డలి తీసుకుని రాయిని బద్దలకొట్టు" అని ఉత్సాహపరిచాడు.  ఆ కుర్రాడు గొడ్డలితో బలంగా రాతిని కొట్టాడు. అది పగిలింది. వెంటనే ఎంతో వేగంగా నీరు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయాడా కుర్రాడు. అంతా ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఆ నీటిని తాగారు, స్నానం చేశారు. పశువులకి స్నానం చేయించారు. వంట చేసుకుని తిన్నారు. 

అక్కడి నుంచి వాళ్లంతా బయలుదేరే ముందు అక్కడ నీళ్లున్నాయన్న సంగతి అందరికీ తెలిసేలా ఓ ధ్వజం పాతారు. సుదూర ప్రాంతాట నుంచి వచ్చే యాత్రికులకు అక్కడ ఎర్రటి ఎండతో మాడే ఎడారి మధ్యలో కొత్త నీటి వూట వుందన్నది తెలిసేలా చేశారు. వారి ప్రయాణం కొనసాగించి సురక్షితంగా ముగించారు.

అసమర్ధునికి అంత:పురం బాధ్యత

ప్రతాపవర్మ అనే రాజుకు వేట అంటే అమితమైన నినోదం. రాజ్య వ్యవహారాలకంటే వేటకే ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. తరచుగా అడవికి వెళ్లి కొద్ది రోజుల పాటు వేటాడి ఆ వినోదం తీరాక రాజ్యానికి వచ్చేవాడు. అలాగే ఒకసారి అడవికి వెళ్తూ భద్రయ్య అనే పనివాడికి అంత:పురం బాధ్యతను అప్పగించాడు. అంత:పురాన్ని భద్రంగా చూసుకుంటానని మాటచ్చాడు భద్రయ్య. 

కొద్ది రోజులకు రాజు వేట సరదా తీరిన తర్వాత తిరిగి రాజ్యానికి వచ్చాడు. భద్రయ్య రాజుకు స్వాగతం పలికాడు. పరిచారికలు రాజుకు హారతి ఇచ్చి పాటలు పాడి ఆహ్వానించారు. అంతా సవ్యంగానే ఉందనుకుంటూ సంతోషించిన రాజు భద్రయ్యతో "భద్రయ్యా! అంతా క్షేమమేనా?" అని అడిగాడు. భద్రయ్య భద్రంగా తలూపుతూ "అంతా భద్రంగా ఉంది ప్రభూ" అని బదులిచ్చాడు. "రాణిగారెక్కడ?" అని అడిగాడు తన వేట ముచ్చట్లను అడిగి తెలుకోవడానికి. రాణి కనిపించలేదేమిటా! అని కలయచూస్తూ.  "యువరాజు గారిని చూడడానికి ఆస్దాన వైద్యుడి విడిదికి వెళ్లారు" అన్నాడు భద్రయ్య. 

"యువరాజు అక్కడ ఎందుకు ఉన్నారు? వారికి ఏమైది?" అన్నాడు రాజు.  "పొరుగు రాజ్యం యువరాజుతో తలపడినప్పుడు తీవ్రమైన గాయాలయ్యాయి ప్రభూ" అన్నాడు భద్రయ్య.  రాజు మనసు కీడు శంకించింది. "పొరుగు రాజ్యం యువరాజుతో ఎందుకు తలపడాల్సి వచ్చింది? ఏ ప్రమాదం మంచుకొచ్చింది" అన్నాడు.  "మన యువరాణి గారిని అపహరించుకుని వెళ్లడానికి వచ్చారు ప్రభూ, అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మన యువరాజు గారు గాయపడ్డారు" అన్నాడు. 

"ఏమిటీ? మన యువరాణిని అపహరిద్దామని వచ్చారా? ఇంతకీ యువరాణిగారు ఎలా ఉన్నారు?" కంగారుగా అడిగాడు రాజు.  "అపహరించుకుని వెళ్లిపోయారు ప్రభూ! బహుశా రాక్షసంగా వివాహమాడి ఉండవచ్చు" వినయంగా సమాధానమిచ్చాడు భద్రయ్య. రాజు వినోదానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి రాజ్యవ్యవహారాలను పక్కన పెట్టాడు. ఆ పరిణామం రాజ్యానికే కాకుండా అంత:పురంలోని మహిళలకు రక్షణ కరువయ్యే పరిస్దితికి దారితీసింది. తన బాధ్యతను తాను నిర్వర్తించక పోవడం ఒక్కటే కాకుండా అసమర్ధుడికి అంతటి ప్రధాన బాధ్యతను అప్పగించడం వల్ల ఎంతటి అనర్ధం ముంచుకు వచ్చిందో అర్ధం చే్సుకున్నాడు. సరిదిద్దుకోలేని పొరపాటు జరిగిన తర్వాత కానీ ఆ రాజుకు తన బాధ్యత తెలిసి రాలేదు.

18 అక్టోబర్, 2013

చెప్పే విధానంలో తేడా!!!

ఒక రోజు రాత్రి అక్బరుకి తన పళ్ళన్నీ రాలిపోయినట్టు కల వచ్చింది. కంగారుగా నిద్రలో నుండి లేచి, వెంటనే ఆస్ధాన జ్యోతిష్యులను పిలిపించాడు. ఆదుర్దాగా వచ్చిన జ్యోతిష్యులకు తన కల గురించి చెప్పి, దాని   పర్యవసానాలు వివరించమన్నాడు. 

జ్యోతిష్యులు చాలాసేపు చర్చించుకుని, "అయ్యా! తమరి కలకు గొప్ప అర్ధమే ఉంది. విన్నవించమంటారా?" అని అడిగారు.  "కానీయండి" అన్నాడు అక్బర్‌.  "జహాపనా! మీ బందువులందరూ మీకంటే ముందుగా చనిపోతారు ప్రభూ" అన్నారు. 

అక్బరుకి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో జ్యోతిష్యులను మందిరం నుండి పంపి వేశాడు. ఆ మరుసటి ఉదయం, యధాలాపంగా బీర్బల్ రాజుగారిని కలుసుకునేందుకు వెళ్లాడు. బీర్బల్‌కి కూడా రాజు తన కల గురించీ, జ్యోతిష్యులు చెప్పిన విషయం గురించీ చెప్పాడు. విషయం అర్ధమైన బీర్బల్‌ - "జహాపనా! నాకూ కొద్దిగా స్వప్న ఫలితాల జ్ణానం ఉంది. మీ కల ప్రకారం మీ బందువలందరికంటే మీరు ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారని అనిపిస్తోంది" అన్నాడు. 

ఈ సమాధానికి అక్బరు సంతోషించి బీర్బల్‌ని సత్కరించి పంపాడు. జ్యోతిష్యులు చెప్పిందీ, తను చెప్పిందీ ఒకటే అయినా, చెప్పే విధానంలో తేడా అక్బరుకి తెలియనందుకు సంతోషించాడు బీర్బల్‌.

1 అక్టోబర్, 2013

యువరాజు అభిమన్యుడు

అనగనగా ఒక రాజు గారు వుండేవారు. ఆ రాజు గారికి పిల్లలు పుట్టలేదంట. దానితో తన తరవాత ఆ రాజ్యం ఎవరు పాలించాలా అని దిగులు పడుతూవుండేవారు. ఒక రోజు బాగా ఆలోచించి తన రాజ్యం లోని పిల్లలందరినీ ఒకచోటకి రమ్మని చాటింపు వేయించాడు. పిల్లలందరూ రాగానే వాళ్ళందరికీతలా కొన్ని విత్తనాలు ఇచ్చి ఒక మాసం లోపు ఎవరి విత్తనాలయితే బాగామొలుస్తాయో వారిని యువరాజు గా చేస్తానని చెప్పాడు.

అదే రాజ్యం లో అభిమన్యుడు అని ఒక చిన్న పిల్లవాడు వుండేవాడు. అభిమన్యుడు చాలా అమాయకుడు, మంచివాడు. అభిమన్యుడు కూడా రాజు గారి దగ్గర విత్తనాలుతీసుకొని ఇంటికి వచ్చేసాడు.ఒక మాసం తర్వాత అందరు మళ్లీ రాజు గారి దగ్గరకు వెళ్లారు. అందరి దగ్గరమంచి మొక్కలు వున్నాయి. రాజు గారు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి వాళ్ళమొక్కలని చూస్తున్నారు. అలా వస్తూ చివరకు అభిమన్యుడు దగ్గరకి వచ్చిమొక్కను చూపించమన్నారు. కానీ అభిమన్యుడు తనకిచ్చిన విత్తనాలు మొక్కమొలవలేదని చెప్పాడు.

రాజు గారు సంతోషించి అందరితో "నేను ఇచ్చిన విత్తనాలకు అసలుమొక్కలు మొలవవు. కానీ అందరు రాజ్యం కోసం మొక్కలు తెచ్చారు.అభిమన్యుడు ఒక్కడే నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడు. కాబట్టి అభిమన్యుడు ఈరాజ్యానికి కాబోయే యువరాజు." అని చెప్పారు. అందరు తప్పు తెలుసుకొని అభిమన్యుడు ని యువరాజుగా అంగీకరించారు.