5 జూన్, 2011

సాధువుగామారిన దొంగ


ఒక రోజు రాత్రి ధనవంతునికి చెందిన తోటలో కాయలు దొంగిలించడానికి దొంగ వచ్చాడు. తోటలోని కొన్ని కాయలు కోసాడు. ఆ అలికిడికి తోటలో నౌకర్లు లేచి దివిటీలు వెలిగించి తోటంతా వెతికారు. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ పట్టుబడకుండా తప్పించుకోవాలని ఒంటికి విభూది రాసుకొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక చెట్టు కింద కూర్చొని సాధువులాగా కొంగ జపం చేయసాగాడు. నౌకర్లు దొంగను పట్టుకోలేక పోయారు. కానీ ఆ తోటలో జపం చేసుకుంటున్న ఆ సన్యాసిని చూసి వారు చాలాచాలా సంతోష పడ్డారు. మరుసటి రోజు ఆ తోటలో సాధువు బసచేసాడన్న వార్త సుడిగాలిగా ఊరిలో ప్రాకి పోయినది. చాలామంది ప్రజలు, పండ్లు, తినుబండారాలు తీసుకొని వచ్చి సాధువు కాళ్ళదగ్గర పడ్డారు. కొంతమంది అతడి పాదాల వద్ద వెండి, బంగారం, డబ్బులు కూడా పెట్టారు.


'నేను దొంగ సన్యాసిని కదా! అయినా ఎంతమంది ప్రజలు నాపట్ల భక్తిశ్రద్ధలు చూపుతున్నారు. ఎంత ఆశ్చర్యం! అని దొంగ ఆలోచించాడు. 'నేను సాధువుగా మారితే ఇంకెంతగా గౌరవిస్తారో? అని ఆలోచించి, నిజమైన సాధువు కావడానికి ఆ దొంగ తీర్మానించుకొన్నాడు. కొంతకాలానికి ఆ దొంగ నిజంగానే ఒక సాధువుగా మారి భగవంతుని కృపను పొందాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి